మంత్రులు, ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు... బాధ్యతతో వ్యవహరించండి: అశోక్ గజపతిరాజు

  • అశోక్ గజపతి వర్సెస్ వైసీపీ
  • మాన్సాస్ ట్రస్టు వివాదంలో ఆగ్రహావేశాలు
  • తనను దెబ్బతీసేందుకే జీవోలు ఇచ్చారన్న అశోక్
  • భవిష్యత్ తరాలు క్షమించబోవని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు తనపై దాడి చేయడానికేనని మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. తనపై కోపం ఉంటే హిందూ మతంపై దాడి చేయనక్కర్లేదని, విద్యాసంస్థలపై అసలే దాడి చేయనక్కర్లేదని పేర్కొన్నారు. హిందువుల డబ్బును మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం సరికాదని, దీన్ని భవిష్యత్ తరాలు క్షమించబోవని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పదవులు శాశ్వతం కాదని, బాధ్యతగా ఉండడం ముఖ్యమని అశోక్ గజపతిరాజు హితవు పలికారు. మనం చేసిన పనే శాశ్వతం తప్ప, పదవులు కాదని ఇది గ్రహించి, జ్ఞానం పెంచుకుని నడుచుకోవాలని పేర్కొన్నారు.

"వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలుకు వెళ్లారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే కొందరు అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారులు జైలుకు వెళ్లాలని నేనైతే కోరుకోవడంలేదు. బాధ్యత ఉన్నవాళ్లయితే అధికారులను కూడా జైలుకు తీసుకెళ్లాలని కోరుకోరు. ఉద్యోగులు రాజ్యాంగాన్ని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్నానని కొందరు అంటున్నారు. కానీ దేవుడి దయవల్ల మాకు కొంచెం ఆలోచించే శక్తి ఉంది" అని అశోక్ గజపతిరాజు మీడియాతో అన్నారు.

Ashok Gajapathi Raju
Jagan
Vijay Sai Reddy
YSRCP
Mansas
Andhra Pradesh

More Telugu News